Showing posts with label jesus seven words and its meaning. Show all posts
Showing posts with label jesus seven words and its meaning. Show all posts

April 16, 2019

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన 33 1/2 ఏళ్లలో 3 1/2 ఏళ్ళు ఆయన రక్షణ సువార్తను లోకానికి అందించాడు,  ఆయన ఈ లోకంలో నడయాడిన ప్రతిదినమూ మనకు సుదినమే. అయినా ఆయన కల్వరిలో సిలువపై మరణించబోయే ముందు గడిపిన చివరి వారం రోజులు మరింత ప్రాముఖ్యమైనవి. ఆ వారం రోజుల్లో తానేరీతిగా మరణించబోతున్నదీ, ఎవరిద్వారా అప్పగింపబడబోతున్నదీ, శిష్యులు ఆయన అనంతరం ఎలా జీవించాలి వంటి ఎన్నో అద్భుతమైన మర్మాలు ఆ ఏడు రోజుల్లో మనకు కనిపిస్తాయి. వాటిని ఏరోజు కారోజు మీకు వివరించాలనే ప్రయత్నం చేసాము.  

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
మొదటిరోజు - శనివారం
ఆ రోజు బెతానియా లోని సీమోను ఇంట్లో మరియ యేసయ్య పాదాలను కడగడంతో ఆయన చివరి దినాలు ప్రారంభం అయ్యాయని అనుకోవచ్చు. త్వరలో జరుగబోయే భూస్థాపనకు ఇది నాంది అంటూ యెసయ్యే స్వయంగా చెప్పడంతో ఈ రోజు ప్రారంభం అవుతుంది. 
*శనివారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:* 
https://youtu.be/cfGO0MLDYg0 

 https://youtu.be/cfGO0MLDYg0


రెండవరోజు - ఆదివారం
ఆదివారం గాడిదపిల్లను అధిరోహించి జనులు హోసన్నా అంటూ జేజేలు పలుకుతుండగా యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. కట్టబడిన గాడిదనూ గాడిదపిల్లనూ వాటి కట్లు విప్పించబడటంలోనూ.. గాడిదపిల్లను అధిరోహించి రావడం లోనూ గొప్ప నిఘూడమైన మర్మాలు అందులో దాగివున్నాయి.  
*ఆదివారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/Gh9dOnAxx-A 



మూడవరోజు - సోమవారం
ఆ రోజు యేసు యెరుషలేము దేవాలయానికి వస్తాడు. అక్కడ వర్తక వ్యాపారుల ఆగడాలు చూసిన యేసు హృదయం తల్లడిల్లిపోతుంది. వ్యాపారుల బల్లలను పడవేసి బంధించిన పావురాలను, కోడెలను, మేకలను వాటి కట్లు తెంపి వాటికి వదిలివేస్తాడు. వాటి కట్లు తెంపి విడుదలను చేయడంలో చాలా బలమైన కారణం ఉంది. అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి
*సోమవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి :* 
https://youtu.be/RpzSrkQIf8E 



నాల్గవ రోజు - మంగళ వారం
ఆ రోజు యేసు యెరుషలేము దేవాలయానికి వచ్చి అక్కడ శిష్యులకు ఇంకా జనాంగానికి దేవుని గురించి బోధిస్తాడు. ఇక్కడ బోధిచడానికి నీకు అధికారం ఎవరు ఇచ్చారు? అంటూ నిలదీసిన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యలకు యేసయ్య తనదైన శైలిలో ఉపమానాల ద్వారా తగిన సమాధానం చెబుతాడు. అంతే కాక తనకు విధించబోయే శిక్షను గురించి.. తన మరణాన్ని గురించి పరోక్షంగా శిష్యులకు, జనాంగానికి బోధిస్తాడు. 
*మంగళ వారం  వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి :*
https://youtu.be/s8E4PZVVRiY  



ఐదవ రోజు - బుధవారం
ఆ రోజు యూదా ఇస్కరియోతు క్రీస్తును అప్పగించడానికి ప్రధాన యాజకులతో కలిసి పన్నాగం పన్నడం,ముప్పై వెండినాణేలకు అమ్ముకోవడం గురించి శుక్రవారం జరుగబోయే దారుణాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకు చెబుతాడు,అసలు యూదా ఏసయ్యను పట్టించడంలో చంపాలనే ఆలోచనతోనే పట్టించాడా?, యూదా మనసులో ఏముంది? అసలు యూదా ఆలా ఎందుకు చేశాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
*బుధవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/NaZDGodT8D8 



ఆరవరోజు - గురువారం
గురువారం యేసుక్రీస్తు జీవితంలో కీలకమైన రోజు. ఆ రోజు యేసు అత్యంత పవిత్రమైన బల్ల ఆరాధనను మనకు అందించాడు, మనం ఎలా జీవించాలో మాదిరిగా చూయించాడు. మనలనూ అలానే జీవించమని ఆశీర్వదించాడు. మన కొరకు మన పాపపంకిలమైన జీవితాల కొరకు క్రీస్తు మరణం వైపు అడుగులు వేస్తూ మనకు రక్షణను అందించడానికి దుర్మార్గులకు తనను తాను అప్పగించుకున్నాడు. 
*గురువారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/pPp6rJWiCSo 



ఏడవ రోజు - శుక్రవారం GOOD FRIDAY 
శుక్రవారం.. క్రైస్తవులకు పవిత్రమైన రోజు, మన పాపాలనుండి దైవకుమారుడు మనకు విముక్తిని అందించిన రోజు. శుభ శుక్రవారంగా ప్రపంచమంతటా పండుగలు జరుపుకునే రోజు. మనుష్యకుమారునిగా జన్మించిన యేసుకు ఈ భూమ్మీద చివరి రోజు. అలాంటి శుక్రవారాన్ని గూర్చి నేడు మనం మరోమారు ధ్యానించడం ఆ దేవుని కృప మాత్రమే. 
*శుక్రవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/fFaw1gEqND4 



యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు  ఈ ఎపిసోడ్ తో పూర్తి అయ్యాయి. దేవుని మహాకృప వలన ఈ వీడియోలను మీకు మన HOPE Nireekshana TV ద్వారా అందిచగలిగాము. భవిష్యత్తులో మరిన్ని సందర్భాలలో మనం కలిసి ఆ తండ్రిని ధ్యానించుకోవాలని.. అట్టి భాగ్యాన్ని మనకు దయచేయాలని ఆ ప్రభువుని ప్రార్ధిద్దాము. 
తప్పక ఈ వీడియోలను చూచి మీ కామెంట్లను బాక్స్ లో వ్రాయగలరు. ఈ వీడియోలు మీకు నచ్చితే మరచిపోకుండా షేర్ చేయగలరు, ఆమెన్. 
యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు

April 03, 2019

WOMAN, BE HOLD YOUR SON || 7 WORDS ON THE CROSS || UNBELIEVABLE BIBLE FACTS

యేసు క్రీస్తు తన అమ్మను అలా ఎందుకు పిలిచాడు !?

SEVEN WORDS ON THE CROSS

భాష ఏదైనా అమ్మను మనం పిలిచే పిలుపులో ఎంతో ప్రేమ, మాధుర్యం దాగి ఉంటాయి. ఏ బిడ్డ అయినా అమ్మను అమ్మ అనే పిలుస్తాడు. అనుకోకుండా ఎదురైన ఆపదలో సైతం ప్రతి ఒక్కరు అమ్మనే స్మరించుకుంటారు. కానీ అమ్మను అమ్మ అని కాకుండా స్త్రీ అని కానీ, మహిళా అనికానీ మనం పిలువగలమా? అంతటి కఠిన హృదయాన్ని ఎవరైనా కలిగి ఉంటారా? కనీసం అలాంటి సందర్భాలనైనా మనం ఊహించగలమా...?

ఊహించాలి తప్పదు..! ఎందుకంటే సాక్షాత్తుగా ఆ దేవాదిదేవుడే ఈ ఇలలో కారణభూతునిగా జన్మించడానికి ఒక ధన్యజీవిని ఎన్నుకున్నాడు. ఆమె ద్వారా ఏ పాపమూ అంటకుండా ఈ భూమిపై జన్మించాడు, సకల జగత్తుకు రక్షణ భాగ్యాన్ని అందించాడు.

లోకానికి ప్రేమించడం నేర్పిన ఆ కరుణామయుడే సాక్షాత్తు తన తల్లిని అమ్మ అని కాక పరాయి స్త్రీని పిలిచినట్లుగా స్త్రీ అని పిలవడమేమిటి?  అవును..! తెలుగు తమిళ మలయాళం వంటి ప్రాంతీయ భాషల్లో యేసుక్రీస్తు తల్లి మరియను అమ్మా అని సంబోధించినట్లుగా బైబిల్లో చూస్తాము. కానీ మూలభాష నుండి తర్జుమా చేయబడిన ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం మరియను స్త్రీ లేదా ఇంగ్లీష్ లో woman అని పిలిచినట్లుగా చూస్తాము. అంటే ప్రాంతీయ భాషల్లో ఉన్నట్లుగా అమ్మా అని కాక యేసుక్రీస్తు తన తల్లి అయిన మరియను స్త్రీ అని సంబోధించాడు. అన్నీ ఎరిగిన ఆ దేవాదిదేవుడే తన తల్లిని అలా ఎందుకు పిలిచాడు? చాలా లోతుగా ఆలోచించవలసిన ప్రశ్న ఇది!

తన మూడున్నర ఏళ్ళ పరిచర్యతో మొత్తం ప్రపంచానికి క్రైస్తవాన్ని, అందులో ఇమిడియున్న ప్రేమను పంచిన ఆ పరమ పునీతునికి ఆ మాత్రం తెలియదా? మహా పండితులను సైతం 12 ఏళ్లకే తన జ్ఞానంతో అలరించిన ఆ దైవకుమారునికి తన తల్లిని ఎలా సంబోధించాలో ఒకరు చెప్పాలా? మరి ఎందుకు అలా అమ్మను అమ్మా అని పిలువక.. ఎవరో బయటవారిని పిలిచినట్లు స్త్రీ అంటూ సంబోధించాడు! ఈ విషయాన్ని గురించి కాస్త లోతుగా చర్చిద్దాం.

పరిశుద్ధ గ్రంధంలో యేసుక్రీస్తు రెండు సందర్భాలలో తన తల్లి మరియను స్త్రీ లేదా woman అని సంబోధించడం మన చూస్తాం. మొదటి సందర్భం కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు కాగా, రెండవసారి సిలువమ్రానుపై వేదన అనుభవిస్తూ అక్కడే ఉన్న యోహానును తన తల్లి మరియ బాధ్యతను అప్పగిస్తూ ఈ విధంగా సంబోధిస్తాడు.

యేసుక్రీస్తు తన ఆధ్యాత్మిక జీవితకాలంలో కుటుంబ వ్యవహారాలకు, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలకు అతీతంగానే ఉన్నట్లుగా మనకు కనిపిస్తాడు. ఆయన జీవితంలోని కొన్ని సందర్భాలను గనుక మనం పరిశీలిస్తే 

ఒకసారి యేసుక్రీస్తు కొంతమంది జనులతో కలిసిఉన్నప్పుడు తల్లి ఐన మరియ ఇంకా ఆయన సోదరులు క్రీస్తును కలవడానికి వస్తారు. ఈ విషయాన్ని ఆయన శిష్యులు వచ్చి యేసు చెబుతారు. అందుకు ఆయన నా తల్లి, సహోదరులు ఎవరు? ఇదిగో నా తల్లి సహోదరులు అంటూ తన చుట్టూ కూర్చున్న వారిని చూయిస్తాడు. అంటే యేసుక్రీస్తు భౌతికమైన బాంధవ్యాలకంటే తండ్రి తనకు అప్పగించిన ఏ పనిమీద ఐతే వచ్చాడో.. ఆ పనికి సంబంధించిన ఆత్మీయ, దైవికమైన సంబంధాలపైనే ఆయన తన దృష్టిని నిలిపాడని మనం అనుకోవాలి.

అదేవిధంగా యేసు 12 ఏళ్ళ ప్రాయంలో పస్కా పండుగ నాడు మరియ దంపతులు యేసును తీసుకుని యెరూషలేము దేవాలయానికి వస్తారు. కానీ తిరిగి వెళ్లేప్పుడు యేసుక్రీస్తు తమతో తిరిగి రాకపోవడం గమనించిన ఆ దంపతులు తిరిగి దేవాలయానికి వచ్చి యేసును గురించి వెదుకుతారు. అక్కడ వేద పండితులతో యేసు దైవికమైన అంశాలను చర్చిస్తూ వారికి కనిపిస్తాడు. యేసు కనిపించక కంగారుపడుతున్న తన తల్లి తండ్రులతో యేసు మీరెలా నన్ను వెదుకుచున్నారు? నేను నాతండ్రి పనులమీద ఉండవలెనని మీరెరుగరా అని ఆ దంపతులతో ఖరాఖండిగా చెప్పడం మనం లూకా గ్రంధము 2:41:49 వచనాలలో చూడవచ్చు. 

అంతేకాక లూకా గ్రంధము 14: 26 వ వచనంలో ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అంటాడు. 27 వ వచనంలో ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు అని కూడా చాలా స్పష్టంగా చెబుతాడు.

అంటే శిష్యులుగా తనను వెంబడింపదలచిన వారు అన్ని బంధకాలను త్రెంచుకొని ఆయన బిడ్డలుగా తండ్రిని చేరుకోవాలి అని ఈ వచనాల్లో మనకు చాలా సూటిగా చెబుతున్నాడు. ఈ రెండు వచనాలు ప్రకారం ప్రభువు మనకు చెప్పేది మనల్ని మన తల్లితండ్రులకు బంధువులకు భార్యా బిడ్డలకు దూరంగా ఉండమని కాదు, అంతకంటే మిన్నగా దేవునియందు మన దృష్టిని లగ్నం చేయాలని ఆయన ఉద్దేశ్యమై ఉండవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే జన్మనిచ్చిన అమ్మను అమ్మ అని అనడంలో ఇవేమి అడ్డుకాదు కదా! అమ్మను అమ్మా అని పిలవడంతో ఇబ్బంది ఏముంది? అనే ప్రశ్న మనలో తప్పక తలెత్తుతుంది.

ఇందుకు సమాధానం మనం చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు అందరిలా పాపములో జన్మించలేదు.ఆయన పుట్టుకకు కన్య మరియను ఒక పాత్రనుగా ఆ తండ్రి తయారుచేసుకున్నాడు. ఈ లోకంలోని ప్రతివారినీ జన్మించక మునుపే ఆయన ఎరిగియున్న రీతిగా మరియను కూడా ఆమె పుట్టకమునుపే ఆయన ఎరిగియున్నాడు. ఆమెను కూడా తన అరచేతులపై చెక్కుకుని యున్నాడు. మరియ యేసుకు ఈ లోకంలో జన్మనీయక మునుపే యేసయ్య   మరియకు తండ్రియై జన్మనిచ్చాడు.

అంతేకాక పుట్టుకతో మనమందరమూ పాపులమే, యేసయ్యకు జన్మనిచ్చిన మరియతో సహా. కానీ క్రీస్తు మహా పరిశుద్ధుడు, ఏ పాపమూ అంటని వాడు, కాబట్టే ఆయన తన తల్లిని అమ్మా అని సంబోధించి ఉండకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. 

అలాగే క్రీస్తు మరియను స్త్రీ లేదా woman అని పిలవడాన్ని గురించి బైబిల్ పండితులు మరో వాదన కూడా చేస్తారు, అదేంటంటే ఆదికాండము 3:15 లో తెలిపిన విధంగా నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అది నిన్ను తలమీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఈ వాక్యాన్ని అనుసరించి దేవుడు సృష్టించిన మొదటి స్త్రీ (woman) అవ్వ కాగా దేవునిచే ఎన్నుకోబడి, ఈ భూమ్మీద సాతాను తలమీద కొట్టి తనకు పుట్టబోయే మహాదేవుని ద్వారా ఈ సకల మానవాళికి రక్షణ అందించిన ఆ మాతృమూర్తిని నూతన స్త్రీ (new woman) గా ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికే యేసయ్య తన తల్లిని స్త్రీ అని సంబోధించి ఎనలేని గౌరవాన్ని అందించాడని అంటారు. 

చివరిగా తన ప్రియ శిష్యుడైన యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పిన విధానాన్ని బట్టి మరియ కేవలం తనకు మాత్రమే తల్లి కాదు, నీకూ తల్లే.. అదేవిధంగా తనను ప్రేమించి ఆరాధించే ఈ సకల మానవాళికీ మరియ మాతృమూర్తి అని పరిచయం చేసి తాను పలికిన చివరి ఏడు మాటల్లో ఒక మాటగా ఆ తల్లికి క్రైస్తవ ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని అందించాడు. నిరంతరం ఓ ప్రేమామయిగా, మాతృమూర్తిగా మన మనస్సులో నిలిచి ఉండేలా మన హృదయాల్లో చెరగని ముద్రను వేసాడు కరుణామయుడైన ఆ పరమతండ్రి. ఆమెన్.

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి


ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

March 22, 2019

Jesus Fourth Word on the Cross - Eli, Eli, lema sabachthani -

నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు 
యేసుక్రీస్తు సిలువలో పలికిన నాల్గవ మాట
Jesus Christ Seven Words on the Cross

యేసుక్రీస్తు తాను సిలువలో మరణించే ముందు పలికిన ఏడు మాటలు గురించి తెలియని క్రైస్తవులు ఉండరు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ దినాలలో ఈ వాక్యాలు మీదే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం, ధ్యానించుకుంటాం. ఈ ఏడు మాటల్లో ఒకటైన నాల్గవ మాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేమిటో.. అందులో ఉన్న మర్మమేమిటో మనమిప్పుడు తెలుసుకుందాం.
నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు. మత్తయి సువార్త 27:46

మనకు ఒకింత ఆశ్చర్యం, ఆందోళన కలిగించే మాట ఇది. రోమన్ సైనికులు యేసును బంధించి, ఘోరాతి ఘోరంగా హింసించి ఆపై ఆయనను చంపడానికి సిలువ మ్రానుపై వ్రేలాడదీసిన ఆ శుక్రవారం రోజు.. యేసు సిలువలో మరణవేదన పొందుతూ ఏలి.. ఏలి.. లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేస్తాడు. ఆ మాటకు నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు అని అర్ధం. దీనినే మనం సిలువలో నాల్గవ మాటగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము (మత్తయి సువార్త 27:46 ).

క్రీస్తు జన్మించక మునుపే ఆయన దేవుని కుమారుడని ఎన్నో లేఖనాలు వ్రాయబడ్డాయి. యేసే తాను దేవుని కుమారుడనని శిష్యులతో పలుమార్లు ప్రస్తావిస్తాడు కూడా. మరి దేవుని కుమారుడైన యేసు ఓ మామూలు మనిషిలా అలా ఎందుకు తన తండ్రిని నన్నెందుకు చెయ్యి విడిచావు అని ప్రశ్నించాడు?

అంతేకాక యూదా ఇస్కరియోతు ద్వారా తనను బంధించి, మరణశిక్ష విధించి చంపుతారని యేసుకు ముందే తెలుసు, తాను చావుకు ఏమాత్రం భయపడకుండా తనకోసం వెదుకుతున్న సైనికులకు తానె ఎదురెళ్లి మరీ మీరు వెదుకుతున్న యేసును నేనే అని చెప్తాడు. ఇంత తెలిసిన యేసుక్రీస్తు ప్రభువు దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని తన తండ్రిని ప్రశ్నించాడు. ఇందులో ఉన్న మర్మం ఏమిటి? ఇంత లోతైన విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి.. అప్పుడు మన విశ్వాసం మరింతగా బలపడుతుంది..

యేసు ప్రభువు జీవించిన ఆ కాలంలో ఇశ్రాయేలీయులు హెబ్రీ అరామిక్ భాషలను మాట్లాడేవారు. ఈ ఏలి ఏలి లామా సబక్తానీ అనే వాక్యంలో ఏలి అనే పదం హెబ్రీ భాషకు చెందినది అయితే... లామా సబక్తానీ అనే పదం అరామిక్ భాషకు సంబంధించి పదం.
యేసుక్రీస్తు సిలువలో ఈ మాటలు పలికినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు యేసు ప్రవక్త ఐన ఏలీయాను పిలుస్తున్నాడు కాబోలు అని భావిస్తారు. కానీ ఈ మాటకు గ్రంధకర్తలు నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు అని సరియైన అర్ధం మనకు అప్పుడే చెప్పారు.

తన తండ్రి తనకు అప్పగించిన పని పూర్తి చేయడానికే తాను ఈ లోకానికి వచ్చానని యేసుకు  తెలుసు, అదేవిధంగా తాను ఎవరినైతే వారి పాపాలనుండి రక్షించి పరిపూర్ణమైన విడుదల అనుగ్రహించాలని తలంచాడో ఆ మనుష్యులే నేడు తనను సిలువ వేసి ఘోరంగా చంపుతారని క్రీస్తుకు తెలుసు, అలాగే ఆయన శిష్యులకూ తెలుసు. కాబట్టి ఆయన సిలువపై వేదన చెందడం అక్కడే ఉన్న ఆయన జనాంగానికి పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు కాబట్టి వారూ కంగారు పడలేదు. కానీ అక్కడే ఉన్న యెరూషలేము పట్టణవాసులు మాత్రం వాస్తవాన్ని తెలుసుకోలేక క్రీస్తు ఏలీయాను పిలుస్తున్నాడు కాబోలు అని అనుకున్నారు.

దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని యేసు ఎందుకు తన తండ్రి ప్రశ్నించి ఉంటాడు? ఎందుకు ఓ సాధారణమైన మామూలు మనిషిలా సిలువపై అంత దీనంగా తన తండ్రిని అర్ధించాడు? ఈ విషయాలను లోతుగా అధ్యయనం చేస్తే యేసు మొదట దేవుని కుమారుడు, కానీ తనకు తానుగా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి ఆయన మనుష్య కుమారుడు అయ్యాడు. అంటే యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుని కుమారుడు, అదేవిధంగా ఆయన ఈ భూమిపై జన్మించడం మూలాన పరిపూర్ణమైన మనుష్య కుమారుడుగా కూడా తనను తానూ మార్చుకున్నాడు.

మత్తయి సువార్తలో మనం యేసు సిలువ మరణం పొందే సందర్భాన్ని ధ్యానం చేస్తుంటే కీర్తనలు 22 వ అధ్యాయం మనకు తప్పక జ్ఞాపకం వస్తుంది. ఒక మనిషి మరణానికి చేరువ అవుతుంటే ఆ వ్యక్తి ఎంతటి ఎంతటి వేదనను అనుభవిస్తాడో క్రీస్తు కూడా ఓ సాధారణ మనిషిలా తనకు తానుగా సిలువలో కష్టాన్నిఅనుభవించాడు, మౌనంగా భరించాడు, అందులోని బాధను తన తండ్రికి విన్నవించాడు.. అలా మనకు ప్రతినిధిలా.. తండ్రికి మనకు మధ్య ఓ వారధిలా ఆ రోజు యేసు సిలువలో మన పక్షాన సాధారణ మనిషిలా నిలిచి శిక్షను అనుభవించి దేవుని కుమారునిలా మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచాడు.

కాబట్టి ఆనాడు సిలువలో క్రీస్తు అనుభవించిన ఆ వేదన ఓ సాధారణ మనిషి అనుభవంలా మాత్రమే మనం పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా కీర్తనల గ్రంధంలో చెప్పినట్లు.. 'ఈ భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవా తట్టు చేసెదరు (కీర్తనలు 22:27) అనే వాక్యాన్ని తనకూ ఆపాదించుకుంటూ క్రీస్తు కూడా తన తండ్రి వైపు తిరిగి కన్నులెత్తి రోదించాడు అని భావించాలి.

దీన్ని బట్టి యేసు సిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని తన తండ్రిని ప్రశ్నించడంలో ఉన్న పరమార్ధం మీకు ఈపాటికి అర్ధం అయ్యే ఉంటుంది. క్రీస్తు మనకొరకు సిలువలో కన్నీరు కార్చాడు, మనకు సమానార్ధమైన శిక్షను తాను భరించాడు. ఓ మానవ మాత్రునిలా మన స్థానంలో ఉండి  మనకొరకు తన తండ్రిని సైతం ప్రశ్నించాడు. మరి ఇంకా మన జీవితాలు మారకుంటే క్రీస్తు సిలువలో కార్చిన రక్తానికి ఫలితమేముంటుంది? ఆయన అనుభవించిన వేదనకు అర్ధం ఏముంటుంది? ఆలోచించండి!

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి

యేసు సిలువలో నాదేవా నన్నెందుకు చేయి విడిచావన్నాడు?



ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.